వెల్గటూర్‌/ధర్మపురి: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేర్చుతున్నామని, ప్రతీ ఊరిలో ఇందిరమ ఇళ్ల నిర్మాణం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి వెల్గటూర్‌ మండలంలో పర్యటించారు. ఎండపల్లి మండలం కొండాపూర్‌లో తొమ్మిది ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్గటూర్‌ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నలుగురికి కల్యాణ లక్ష్మి, 91 మందికి రూ.31.03లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. జగదేవుపేట గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం దగ్ధమైన ఈత వనాన్ని పరిశీలించారు. వెల్గటూర్‌, ఎండపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు శైలేందర్‌రెడ్డి, శేఖర్‌ యాదవ్‌, తహసీల్దార్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రోత్సహించే దిశగా రూపొందించిన తెలంగాణ బడి వెబ్‌సైట్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రారంభించారు. ధర్మపురికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు గొల్లపెల్లి గణేశ్‌ తీర్చిదిద్దిన వెబ్‌సైట్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్‌ పాఠాలు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పేపర్లు, ఇంటరాక్టివ్‌ క్విజ్‌లు, వ్యాకరణాంశాలను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచామన్నారు.