ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలో ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ పాల్గొని, తన భుజంపై ఉన్న బ్యాడ్జీని తొలగించి అభిజిత్ దీప్కేకు అందజేశారు. ఈ చర్యతో అక్కడ ఉన్న నిరసనకారులు అతడిని అభినందిస్తూ చప్పట్లతో మద్దతు తెలిపారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను ఉత్తరాఖండ్ పోలీసులు బయటపెట్టారు.

షేర్ సింగ్ చాలా కాలంగా విధుల్లో లేరని, 2025లో నమోదైన ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారని కుమావోన్ ఐజీ కుక్రేటి తెలిపారు. ప్రస్తుతం ఆయనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. హరిద్వార్-రూర్కీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకి ముఠాతో షేర్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ప్రజలను బెదిరించి భూములను ఆక్రమించడం, నకిలీ పత్రాలతో ఆస్తులను బదిలీ చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు షేర్ సింగ్ సహకరించారని పోలీసులు పేర్కొన్నారు. కానిస్టేబుల్‌గా ఉంటూనే, సితార్‌గంజ్ జైలులో మరియు రూర్కీ కోర్టులో గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకిని పలుమార్లు కలవడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఒక వితంతువుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు నిందితులకు సహకరించడంతో పాటు, కేసును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిని బెదిరించినట్లు కూడా షేర్ సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఆధారాలు సేకరించిన అధికారులు, 2025 సెప్టెంబర్ 15న ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం నైనిటాల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు.