అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ను రప్పించేందుకు మంత్రి నారాయణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నారాయణ బుధవారం పవన్తో భేటీ అయినప్పటికీ, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకుండా విశాఖ పర్యటనకు వెళ్లారు.
ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణ వ్యయాలు, అంచనాల మార్పులపై పవన్ అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిర్మాణాల్లో మరింత పారదర్శకత ఉండాలని ఆయన గతంలోనే సూచించినట్లు సమాచారం. ఈ అంశాలపై జనసేన పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
గతంలో చంద్రబాబును ప్రశంసించిన పవన్, ఇటీవల కాలంలో అటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే మూడుసార్లు కేబినెట్ సమావేశాలకు గైర్హాజరైన ఆయన, భోగాపురం ఎయిర్పోర్టు కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. ఈ పరిణామాలపై టీడీపీ-జనసేన కూటమి నేతలు బహిరంగంగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు.
అమరావతి కార్యక్రమానికి పవన్ గైర్హాజరు కావడంతో, ఆయన అసంతృప్తిగా ఉన్నారా అనే ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో అమరావతిపై ఒక ప్రకటన ఇప్పించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.








