సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్టకు చెందిన సుమతి గత నెల 25న ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేశారు. 15 రోజులైనా రాలేదు. ఈ– కేవైసీ చేయకపోవడంతో డెలివరీ నిలిపివేసినట్లు తెలిసింది. వెంటనే ఏజెన్సీకి వెళ్లి ఈ–కేవైసీ చేసుకోవడంతో మరుసటి రోజే సిలిండర్‌ వచ్చింది. ప్రస్తుతం నగరంలో చాలామంది వినియోగదారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఈ నెల 16లోగా ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు గడువు విధించాయి. ఇండియన్‌ ఆయిల్, భారత్‌ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీలు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. కాగా నేరుగా ఏజెన్సీ వద్ద, యాప్‌ల ద్వారా మొబైల్‌లో లేదా ఇంట్లోనే బయోమెట్రిక్‌ ద్వారానూ ఈ–కేవైసీ చేసుకోవచ్చు. మహా నగరంలో ఇంకా లక్షలాది మంది ఈ పని చేయలేదు. కంపెనీల అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారానే కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆధార్, ఓటీపీ ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నాయి.