కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారులు బెంగళూరులో వరుస తనిఖీలు చేపట్టారు. ఆగస్టు 11న హోస్కోట్‌లోని జెప్టో (Zepto) వేర్‌హౌస్‌ను సీజ్ చేసిన అధికారులు, మరుసటి రోజు ఆగస్టు 12న బన్నేర్‌ఘట్ట రోడ్డులోని సకలవరలో ఉన్న జొమాటోకు చెందిన 'హైపర్‌ప్యూర్' (Hyperpure) వేర్‌హౌస్‌లో సోదాలు నిర్వహించి దాన్ని సీజ్ చేశారు.

జెప్టో వేర్‌హౌస్‌లో తనిఖీలు చేసిన సమయంలో తీవ్రమైన అపరిశుభ్రత, చెత్తాచెదారం మరియు లేబులింగ్‌లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నిబంధనలను పాటించకపోవడంతో, ఆ వేర్‌హౌస్ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని అధికారులు సిఫార్సు చేశారు. దీనిపై స్పందించిన జెప్టో ప్రతినిధి, తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని, లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జొమాటో వేర్‌హౌస్‌లో జరిపిన తనిఖీల్లో కూడా పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి. సుమారు 146 కిలోల చికెన్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అలాగే, 40 కిలోల వెల్లుల్లి, 300 కిలోల ప్యాక్ చేసిన బియ్యం, 20 కిలోల డ్రై ఫ్రూట్స్, 15 కిలోల మసాలా ప్యాకెట్లపై తప్పుడు లేబులింగ్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. నిబంధనల ప్రకారం రిఫ్రిజిరేషన్‌లో ఉంచాల్సిన 10 కిలోల ముల్లంగి ఊరగాయను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీల సందర్భంగా అధికారులు తదుపరి పరిశీలన కోసం మొత్తం 40 నమూనాలను సేకరించారు. ఇందులో ఐదు చట్టబద్ధమైన నమూనాలు, 35 సర్వే నమూనాలు ఉన్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో కూడా ఇదే తరహాలో ముంబైలోని ఒక బ్లింకిట్ (Blinkit) కేంద్రం ఫుడ్ లైసెన్స్‌ను అక్కడి ఎఫ్‌డీఏ (FDA) రద్దు చేసింది.