బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, ఇద్దరు హిందువులు దారుణంగా హత్యకు గురయ్యారు. నౌగావ్ జిల్లా మహాదేవ్పూర్లో 45 ఏళ్ల స్వర్ణకారుడు అలీఫ్ చంద్ర దత్తాపై దుండగులు దాడి చేశారు.
సోమవారం రాత్రి 8.30 గంటలకు తన నగల దుకాణం నుంచి ఇంటికి బయలుదేరిన దత్తాను, రాత్రి 9 గంటల సమయంలో దులాల్పారా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి, అతడి వద్ద ఉన్న బంగారం మరియు 7 లక్షల బంగ్లాదేశీ టాకాలను (బంగ్లాదేశ్ కరెన్సీ) దోచుకుని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దత్తా, రాజ్షాహీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన కేవలం దోపిడీ కోణంలో జరిగిందా లేదా దీని వెనుక ఏదైనా కక్ష ఉందా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు మహాదేవ్పూర్ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు కాక్స్బజార్ జిల్లా మహేశ్ఖాలీ ఉపజిల్లాలో రాణి సుశీల్ అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో హోనాక్ యూనియన్లోని తన ఇంట్లో ఆమె వంట చేసుకుంటుండగా, గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం కోసం లోపలికి చొరబడ్డాడు.
అతడిని గమనించి రాణి కేకలు వేయడంతో, ఆ దుండగుడు ఆమె ముఖాన్ని పట్టుకుని కత్తితో పలుమార్లు పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో చకారియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే రంగ్పూర్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తితో పాటు ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు హత్యకు గురయ్యారు. వరుసగా జరుగుతున్న ఈ దాడులు మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.








