ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని పిలానీకి చెందిన 20 ఏళ్ల సోహిల్ రాజ్‌కుమార్ సాంగ్వాన్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోహిల్ ఐఐటీ బాంబేలో మెటీరియల్ సైన్స్ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

పోవాయి క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో బెడ్‌షీట్‌తో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కుటుంబ సమస్యలు, రిలేషన్‌షిప్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులే సోహిల్ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీస్ అధికారి తెలిపారు. విద్యార్థి మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు సోహిల్ మొబైల్ ఫోన్, చాట్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నారు.