Monkey Fight : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోతుల మధ్య జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణాలను బలితీసుకుంది. భవనంపై కోతులు కొట్టుకోవడంతో పైనుంచి పడిన సిమెంట్ ఇటుక తలకు తగలడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది.
ధర్మపురి పట్టణ పరిధిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే కోనపర్తి పద్మ అనే మహిళ తన ఇంటి సమీపంలోని ఒక బిల్డింగ్ కింద కూర్చుని ఉంది. ఆ సమయంలో సదరు భవనంపై కొన్ని కోతులు గుంపులుగా చేరి ఒకదానితో ఒకటి తీవ్రంగా కొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణలో భవనంపై ఉన్న ఒక బరువైన సిమెంట్ ఇటుక అంచుకు జరిగి, ప్రమాదవశాత్తూ కిందకు జారిపడింది.
భవనం పైనుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఆ సిమెంట్ ఇటుక సరిగ్గా కింద కూర్చుని ఉన్న పద్మ తలపై బలంగా పడింది. ఇటుక నేరుగా తలకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఇందిరమ్మ కాలనీలో తీవ్ర కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

