NEET-UG పరీక్షలో మొత్తం 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 58 శాతానికి పైగా మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. ఈ ఏడాది 720 మార్కులకు గాను 715 మార్కులను ఆర్యన్ గుప్తా, పంషుల్ బన్సాల్ సాధించగా, 1,492 మంది అభ్యర్థులు 650కి పైగా మార్కులు పొందారు. అలాగే 10,160 మంది అభ్యర్థులు 600 మార్కులకు పైగా సాధించినట్లు NTA వెల్లడించింది.
మే 9న జరిగిన పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో, మే 12న NTA ఆ పరీక్షను రద్దు చేసింది. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. అనంతరం జూన్ 21న నిర్వహించిన పునఃపరీక్ష తర్వాత ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఈ వివాదాల నేపథ్యంలో, భవిష్యత్తులో NEET-UG పరీక్షను కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పరీక్షా ఫలితాలు సమయానికి విడుదల కావడంతో, వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని NTA స్పష్టం చేసింది. ప్రక్రియను సమాంతరంగా నిర్వహించడం, OMR షీట్ సవరణను వేరు చేయడం వంటి మార్పుల ద్వారా ఫలితాలను సకాలంలో అందించగలిగామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని మొత్తం 1,08,000 MBBS సీట్ల భర్తీకి ఈ ఫలితాలు కీలకం కానున్నాయి.






