ఒకప్పుడు అప్పులు చేస్తే దివాళా తీశారని, పనైపోయిందని ప్రజలు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు జెన్ జెడ్ తరం ఈ ధోరణిని మార్చేసి, వ్యక్తిగత రుణాలను తమ ఆర్థిక ప్రణాళికలో భాగంగా మార్చుకుంది. అత్యవసర అవసరాలకు మాత్రమే కాకుండా, ట్రావెలింగ్, విద్య, గ్యాడ్జెట్లు మరియు జీవనశైలి ఖర్చుల కోసం కూడా వారు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఎంచుకుంటున్నారు.
గతంలో పెద్ద ఖర్చు వస్తే షేర్లు అమ్మేవారు, బ్యాంకు డబ్బులు డ్రా చేసేవారు లేదా స్థిరాస్తులు విక్రయించేవారు. ఇప్పుడు యువ రుణగ్రహీతలు మాత్రం తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను అలాగే ఉంచి, అవసరమైన నిధుల కోసం క్రెడిట్ను వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడులపై వచ్చే చాలా కాలంగా ఉన్న లాభాలు కొనసాగుతూనే, వెంటనే డబ్బు అందుబాటులోకి వస్తోందని ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు. యువత వ్యక్తిగత క్రెడిట్ను ఒక ఈజీ లిక్విడిటీ సాధనంగా చూస్తోంది.
క్రెడిట్ బ్యూరో CRIF హైమార్క్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2026 మే నాటికి జెన్ జెడ్ వినియోగ క్రెడిట్ పోర్ట్ఫోలియో విలువ రూ.14.7 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23.8 శాతం పెరిగింది. ఈ మొత్తం రుణాల్లో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు కలిసి 71 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం. ఇందులో Unsecured Loans కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అయితే రుణం తీసుకోవడం తప్పు కాదని, కానీ ఆదాయానికి అనుగుణంగా మాత్రమే అప్పులు చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వడ్డీ రేట్లు, ఈఎంఐ, రుణ కాలపరిమితి, క్రెడిట్ స్కోర్ మరియు తిరిగి చెల్లించే కెపాసిటీ వంటి అంశాలను పూర్తిగా అంచనా వేసుకున్న తర్వాతే ముందుకు సాగాలని సూచిస్తున్నారు. సరైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే, వ్యక్తిగత రుణాలు భారం కాకుండా ఆర్థిక నిర్వహణకు ఉపయోగపడే సాధనంగా మారతాయి.








