ఖాట్మండు వీధుల్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ఉపాధి అవకాశాలు లేవని, ప్రభుత్వం తమపై పట్టించుకోవడం లేదని భావించిన ముగ్గురు యువకులు గత మూడు రోజుల వ్యవధిలో తమపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దుర్ఘటనలతో కాట్మండు మేయర్ బాలేంద్ర షాపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. 'బాలెన్'గా పిలువబడే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. యువతకు ఆశ, ఆత్మవిశ్వాసం నింపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఆరోపించింది. జెన్-జెడ్ నేపాల్ సంస్థ కూడా ప్రభుత్వ విధానాలను నిరంకుశమని, యువతకు ఆదాయం పెంచేందుకు బడ్జెట్‌లో ఎలాంటి నిర్దిష్ట చర్యలు లేవని విమర్శించింది.

2023లో ప్రేమ్ ఆచార్య ఆత్మహుతి ఘటన గుర్తుకు వస్తోంది. అప్పుడు కాట్మండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర షా ఆ ఘటనను 'ప్రభుత్వ పరమ వైఫల్యం' అని పిలిచారు. కానీ, ఇప్పుడు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా ఆయన మౌనం వహించడంపై పార్టీలు, ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం, క్షీణిస్తున్న మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని పౌర సమాజ సంస్థలు హెచ్చరించాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నిరసనల్లో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి, మందగించిన ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆగ్రహమే ఆ నిరసనలకు కారణం. అప్పుడు బాలెన్ షా పాడిన 'నేపాల్ హాన్సెకో' పాట నిరసనల ప్రతీకగా మారింది. 2022లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత బాలెన్ షా నగర శుభ్రత, వారసత్వ సంరక్షణ, అవినీతిపై కఠిన చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం వల్ల ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడింది. అయితే, ఈ చర్యల వల్ల వీధి వ్యాపారులు, మురికివాడల నివాసితుల నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.