ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం NEET-PG పరీక్షా విధానంలో కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికలో మూడు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. గతంలో దరఖాస్తు చేసిన క్రమం ఆధారంగా కేంద్రాలను కేటాయించేవారు, దీనివల్ల ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త విధానంతో సొంత రాష్ట్రం లేదా నగరంలోనే పరీక్ష రాసే అవకాశం మెరుగుపడింది.

పరీక్షా కేంద్రం ఖరారైన వివరాలను పరీక్షకు మూడు వారాల ముందే అభ్యర్థులకు తెలియజేస్తారు. దీనివల్ల విద్యార్థులు తమ ప్రయాణాన్ని, ఇతర ఏర్పాట్లను ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా, పరీక్షా పత్రాల తయారీ, రవాణా, భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

పరీక్షా కేంద్రాల్లో భద్రతను పెంచేందుకు ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేశారు. దరఖాస్తు సమయంలోనే కాకుండా, పరీక్ష రోజున కూడా ఈ ధృవీకరణ ఉంటుంది. ఒకవేళ వేలిముద్రలు సరిపోలని పక్షంలో ఐరిష్ బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల గుర్తింపును నిర్ధారిస్తారు.

పరీక్షా సరళిలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉండగా, ఈసారి 180 ప్రశ్నలకు 210 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ప్రశ్నల ఎంపిక, అనువాదం, ప్రూఫ్ రీడింగ్ వంటి ప్రతి దశలోనూ కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.