అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు క్యాన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.
బీబీసీ ‘న్యూస్నైట్’ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హంటర్ బైడెన్ మాట్లాడుతూ.. తన తండ్రి క్యాన్సర్ చాలా బాధాకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరకంగా జో బైడెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై బైడెన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.
జో బైడెన్ చెబితేనే.. 2025 మేలో తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు జో బైడెన్ వెల్లడించారు. అది దూకుడుగా వ్యాప్తి చెందే రకమని, అప్పటికే ఎముకలకు పాకిందని వైద్యులు గుర్తించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఆయన రేడియేషన్ చికిత్స, హార్మోన్ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం.
వయసుతోపాటు ఆరోగ్యంపై చర్చ83 ఏళ్ల బైడెన్.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధుల్లో ఒకరు. 2021–2025 మధ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన శారీరక ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలుమార్లు చర్చ జరిగింది. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన వయసు, ఆరోగ్య అంశాలు రాజకీయంగా ప్రధాన చర్చగా మారాయి.
రాజకీయ జీవితంలో కీలక అధ్యాయండెలావేర్ నుంచి దీర్ఘకాలం సెనేటర్గా ఉన్న బైడెన్.. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2020 ఎన్నికల్లో విజయం సాధించి అమెరికాకు 46వ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. తన రాజకీయ జీవితంపై ఆధారిత జ్ఞాపకాల పుస్తకాన్ని నవంబర్లో విడుదల చేయనున్నారు.
ట్రంప్ ఏమన్నారంటే.. బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు ట్రంప్ తొలుత “ఇది చాలా బాధాకరం” అంటూ ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. అయితే దీనిపైనా ఆయన రాజకీయం చేశారు. ఈ విషయం ప్రజలకు ఆలస్యంగా ఎందుకు వెల్లడైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే హంటర్ తాజా స్టేట్మెంట్పై ట్రంప్ ఇంకా స్పందించలేదు.








