టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు నితీశ్ అసౌకర్యానికి గురయ్యాడు. రెండో వన్డేలో విశ్రాంతి తీసుకున్నప్పటికీ, మూడో వన్డేలో తిరిగి బరిలోకి దిగడంతో గాయం మరింత తీవ్రమైంది. దీనివల్ల అతడిని టెస్టు క్రికెట్లో తొందరగా ఆడించడం ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ భావిస్తోంది.
క్రిక్బజ్ నివేదిక ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. అక్కడ అతను కోలుకుంటున్నప్పటికీ, శ్రీలంక పర్యటనకు అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, నితీశ్ గైర్హాజరుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
భారత జట్టు శ్రీలంకలో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్టు, ఆగస్టు 23న కొలొంబో వేదికగా రెండో టెస్టు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు.








