ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్.ఎమ్. కీరవాణి కుమారుడు, సంగీత దర్శకుడు కాల భైరవతో ప్రేమలో ఉన్నట్లు నటి కావ్య కల్యాణ్‌రామ్ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాల భైరవతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, తమ బంధం గురించి ఆమె తన మనసులోని మాటలను పంచుకున్నారు.

'నా సాధారణ రోజులను కూడా ప్రత్యేకంగా మార్చినందుకు కృతజ్ఞతలు. నేను వద్దన్నా కూడా నాకు ఇష్టమైన డైట్ కోక్ కావాలని గుర్తుపెట్టుకునే నువ్వు, నా జీవితాంతం తోడుగా ఉండాలి' అంటూ కావ్య తన ప్రేమను వ్యక్తపరిచారు. తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి దేవుడి ఆశీస్సులని, సరైన భాగస్వామి దొరికినప్పుడు ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కాల భైరవ కూడా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. తమ మధ్య ఉన్న బంధం జీవితాంతం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడంతో, సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఫిలిం నగర్‌లో సాగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడింది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి' సినిమాలో నటించిన కావ్య, ఆ తర్వాత 'మసూద', 'బలగం' సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. మరోవైపు 'ఆర్‌ఆర్ఆర్' సినిమాలోని పాటలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కాల భైరవ, ప్రస్తుతం సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో ఈ జంట కలిసి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.