కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలోంగింగ్' త్వరలో పాఠకుల ముందుకు రానుంది. ఈ పుస్తకాన్ని ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ (Alfred A. Knopf) అనే ప్రచురణ సంస్థ నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

79 ఏళ్ల సోనియా గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి భారతదేశంలో గడిపిన జీవితం వరకు అనేక అంశాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు. యుద్ధం జరిగిన తర్వాత ఇటలీలో ఆమె గడిపిన బాల్యం, కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో మొదలైన ప్రేమాయణం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.

తన అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యల గురించి కూడా ఆమె ఈ స్మృతి గ్రంథంలో ప్రస్తావించారు. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ, 1965లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీని కలిశారు. ఆ తర్వాత 1968, ఫిబ్రవరి 25న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

ప్రచురణకర్త ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పుస్తక ముఖచిత్రాన్ని విడుదల చేశారు. సోనియా గాంధీ యవ్వనంలో ఉన్నప్పటి నలుపు-తెలుపు ఛాయాచిత్రాన్ని ఈ పుస్తక కవర్‌పై ముద్రించారు. ప్రపంచంలోని ప్రముఖ మహిళా నాయకులలో ఒకరిగా ఆమె ప్రయాణం, భారతదేశం పట్ల ఆమెకున్న అనుబంధం ఈ పుస్తకంలో ఉంటుందని ప్రచురణ సంస్థ పేర్కొంది.

ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన సోనియా గాంధీ, తన జీవితాన్ని మాత్రమే కాకుండా తాను దత్తత తీసుకున్న దేశం భవిష్యత్తును ఎలా మార్చారో ఈ పుస్తకం వివరిస్తుంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా గాంధీ, తన వ్యక్తిగత సంబంధాల గురించి నిశితంగా ఈ పుస్తకంలో వివరించారు.