సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జూలై 26న జరిగిన రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు. వేదికపై ఉన్న అతిథులను రైల్వే అధికారులు సన్మానిస్తున్న సమయంలో, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును పిలవకపోవడం వివాదానికి దారితీసింది.

సభకు హాజరుకాని పలువురు ఎమ్మెల్సీల పేర్లను అధికారులు ప్రస్తావించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ ఎమ్మెల్యేను కావాలనే అవమానించారంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలు వేదిక వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన బీజేపీ నేతలు రైల్వే అధికారులను మందలించడంతో, వారు వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సన్మానించి బొకే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగం ప్రారంభించడంతో ఆందోళనకారులు శాంతించారు.

ప్రోటోకాల్‌ను విస్మరించడంపై కొమురవెల్లి సర్పంచ్ గొల్లపల్లి పద్మాఆంజనేయులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం కొనసాగింది.