తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం సెక్రటేరియట్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGOA) మరియు తెలంగాణ ప్రభుత్వ ఆల్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TGARIEA) నాయకులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌పై మంత్రి సంతకం చేసి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కంభంపాటి శారదకు పంపారు. జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జోనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్స్ సహా అన్ని క్యాడర్లలో కలిపి మొత్తం 1,400 పదోన్నతులను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ పదోన్నతులు అవసరమని ఆయన పేర్కొన్నారు.

2023 నుంచి పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జి అధికారులతోనే పాలన సాగుతోందని, దీనివల్ల వ్యవస్థపై ప్రభావం పడుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రికి వివరించారు. డిప్యూటీ సెక్రటరీ పోస్టుల భర్తీలో 3:1 నిష్పత్తిని పాటించాలని, అర్హులైన సీనియర్లకు న్యాయం చేయాలని TGOA లిఖితపూర్వకంగా కోరింది. పదోన్నతులు కల్పించడం వల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరగడమే కాకుండా, విద్యార్థులకు మెరుగైన సేవలు అందుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.

మంత్రి ఆదేశాల మేరకు కార్యదర్శి త్వరలోనే పదోన్నతుల ఉత్తర్వులను విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని TGARIEA రాష్ట్ర అధ్యక్షుడు అలగోని నరసింహులు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.