దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) 2027 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ క్రమంలో GATE 2027 రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌, పరీక్ష తేదీలను ఐఐటీ మద్రాస్‌ ప్రకటించింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ (RA) పేపర్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు గతంలో ప్రత్యేక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (XE)లోని ఒక సెక్షన్‌గా చేర్చారు. దీంతో రోబోటిక్స్‌ పేపర్‌ కొత్తగా చేరినప్పటికీ మొత్తం టెస్ట్‌ పేపర్ల సంఖ్య 30గానే కొనసాగుతుంది. GATE స్కోర్‌ను ఐఐటీలు, ఐఐఎస్సీ తదితర విద్యాసంస్థల్లో ఉన్నత విద్య ప్రవేశాలకు ఉపయోగించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSUs) ఉద్యోగ నియామకాలకూ పరిగణనలోకి తీసుకుంటారు. GATE 2027 స్కోర్‌ ఫలితాల ప్రకటన తేదీ నుంచి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

గేట్‌ 2027 దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ తదితర విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీలో మూడో సంవత్సరం లేదా అంతకంటే పై తరగతిలో చదువుతున్న విద్యార్థులు GATE 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు. ఈ అర్హతలు ఉన్న వారుGATE 2027కు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 21, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తులో వాటిని ఎంపిక చేసుకోవాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించరు. దరఖాస్తు ఫీజు కింద ఒక్కో టెస్ట్‌ పేపర్‌కు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000, ఇతర కేటగిరీల అభ్యర్థులు, విదేశీ విద్యార్థులు రూ.2,000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

GATE 2027 పరీక్ష కంప్యూటర్‌ ఆధారితంగా (CBT) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు (MCQs), మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు (MSQs), న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ (NAT) ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 3 గంటలపాటు జరుగుతుంది. మొత్తం 65 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి.