మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో 2006లో ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమను స్థాపించారు. గత 20 ఏళ్లుగా ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు, స్థానికులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమను విస్తరించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం స్థానికంగా తీవ్ర నిరసనకు దారితీసింది.

రెండు వారాల క్రితం పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ ప్రజలు విస్తరణను వ్యతిరేకించారు. అంతేకాకుండా, ఉన్న పరిశ్రమను పూర్తిగా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రజలకు మద్దతుగా నిలిచారు. రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామస్తులతో కలిసి ఈనెల 12న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.

పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో వందల మంది కార్మికులు మరణించారని, బాధిత కుటుంబాలకు యాజమాన్యం సరైన నష్టపరిహారం చెల్లించలేదని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాల అమలు, స్థానికులకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ, శనివారం ఫ్యాక్టరీ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్రమాలను బయటపెడతామని ఆయన ప్రకటించారు.

ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం-2005 కింద తూప్రాన్‌ సీఐ వెంకటరాజాగౌడ్‌కు వంటేరు ప్రతాప్‌రెడ్డి దరఖాస్తు చేశారు. 2006 నుంచి 2026 జూలై 10వ తేదీ వరకు కంపెనీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలు, మరణించిన కార్మికుల సంఖ్యకు సంబంధించిన పత్రాలను అందించాలని ఆయన కోరారు.