ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నెలకు రూ. 199 ధరతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు సాధారణంగా రూ. 400 ప్రారంభ ధరతో పోస్ట్‌పెయిడ్ సేవలను అందిస్తుండగా, BSNL దాదాపు 50 శాతం తక్కువ ధరకే ఈ ప్లాన్‌ను అందిస్తోంది.

ఈ రూ. 199 ప్లాన్ ద్వారా వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS సౌకర్యాలను పొందవచ్చు. అలాగే, 25GB హై-స్పీడ్ డేటాను కంపెనీ అందిస్తోంది. డేటా లిమిట్ ముగిసిన తర్వాత ప్రతి MBకి ఒక పైసా చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్‌లో 75GB వరకు డేటా రోల్‌ఓవర్ సదుపాయం కూడా ఉంది, అయితే ఇందులో యాడ్-ఆన్ ఫ్యామిలీ కనెక్షన్ ఉండదు.

టెలికాం టాక్ నివేదిక ప్రకారం, దేశంలో మరే ఇతర టెలికాం సంస్థ ఈ ధరకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందించడం లేదు. చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఇదే ధరకు లభిస్తున్నప్పటికీ, ఎయిర్‌టెల్ లేదా Jio వంటి సంస్థల రూ. 199 ప్లాన్లలో ఈ స్థాయిలో డేటా లేదా నెల రోజుల వ్యాలిడిటీ లభించడం లేదని పేర్కొంది.

ఉదాహరణకు, Jio రూ. 199 ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా చొప్పున మొత్తం 27GB డేటాను అందిస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు Jio టీవీ, Jio AI క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాలను కంపెనీ కల్పిస్తోంది.