తమిళ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా కుమారుడైన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. నిజానికి ధనుష్కు నటుడు కావాలనే ఆలోచన లేదు, ఆయన చెఫ్ కావాలని కలలు కనేవారు. అయితే, తన తండ్రి మరియు సోదరుడు సెల్వరాఘవన్ ఒత్తిడి మేరకు ఆయన కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది.
2002లో ‘తుళ్లువదో ఇళమై’ చిత్రంతో ధనుష్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2011లో వచ్చిన ‘3’ సినిమాలోని “వై దిస్ కొలవెరి డి” పాటను ఆయనే స్వయంగా రాసి పాడగా, అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2013లో ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ‘రాంఝానా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు.
నటనలోనే కాకుండా దర్శకత్వంలోనూ ధనుష్ తన ప్రతిభను చాటారు. ‘పా పాండి’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన, ‘వండర్బార్ ఫిల్మ్స్’ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించారు. ‘ఆడుకాలం’, ‘అసురన్’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకోగా, ఆయన నిర్మించిన ‘కాక ముట్టై’, ‘విసరణై’ చిత్రాలు కూడా జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలోనూ ధనుష్ తన ముద్ర వేశారు. ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ మరియు నెట్ఫ్లిక్స్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’లో ఆయన నటించారు. వ్యక్తిగత జీవితానికి వస్తే, 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్కు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య విడిపోయారు.








