చైనా జూలై 1 నుంచి ఎథ్నిక్ యూనిటీ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం జాతి ఐక్యతను దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ చట్టంలో జాతి ఐక్యతను దెబ్బతీయడం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించలేదు.

ఉయ్గర్లు టర్కిక్ జాతికి చెందిన ముస్లింలు. వారి నివాసం షింజియాంగ్ ప్రాంతం. వీరు ఈ ప్రాంతాన్ని తూర్పు టర్కిస్తాన్ అని పిలుస్తారు. వారికి వేల ఏళ్ల చరిత్ర, ప్రత్యేక భాష, సంస్కృతి ఉందని వారు చెబుతున్నారు. కానీ బీజింగ్ షింజియాంగ్ ఎప్పటి నుంచో చైనాలో అంతర్భాగమేనని వాదిస్తోంది.

మానవ హక్కుల సంస్థలు 2017 నుంచి లక్షలాది ఉయ్గర్లను నిర్బంధ శిబిరాలకు తరలించారని, వారి మత విశ్వాసాలను మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నాయి. మసీదుల కూల్చివేత, భాష వినియోగం పరిమితం చేయడం, పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. చైనా ఈ ఆరోపణలన్నింటినీ తిరస్కరిస్తోంది. ఇవన్నీ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేపట్టిన చర్యలేనని చెబుతోంది.

ఈ చట్టం విదేశాల్లో ఉన్న ఉయ్గర్ కార్యకర్తలపై కూడా అమలు కావచ్చని అధికారుల వ్యాఖ్యలు ఆందోళనను పెంచుతున్నాయి. బెర్లిన్, లండన్, వాషింగ్టన్, టోక్యో లో నిరసనలు జరిగాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఈ చట్టాన్ని ఖండించారు. మానవ హక్కుల సంస్థలు ఇది కొత్త చట్టం కాదు, ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలకు బలమైన చట్టబద్ధత ఇచ్చే ప్రయత్నమని హెచ్చరిస్తున్నాయి.