Telugu » Andhrapradesh » Tirumala Interstate Gang Arrested Fake Aadhar Ttd Room Booking Scam

Tirumala interstate gang arrested fake aadhar ttd room booking scam

Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే, భక్తుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే దళారుల ముఠాలు కూడా తిరుమలలో ఊపందుకుంటున్నాయి. తాజాగా టీటీడీ విజిలెన్స్, పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా నిర్వహించిన తనిఖీల్లో భక్తులను దారుణంగా మోసం చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సీఆర్‌ఓ ఆఫీస్ పరిసరాల్లో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా ఆధార్ కార్డుల్లోని ఫోటోలను మార్ఫింగ్ చేసి, నకిలీ గుర్తింపు కార్డులతో సీఆర్‌ఓ వద్ద రూ.50 నుండి రూ.1,000 విలువైన టీటీడీ(Tirumala) వసతి గదులను బుక్ చేసేది. అనంతరం గదులు దొరకక ఇబ్బంది పడుతున్న అమాయక భక్తులకు వాటిని భారీ ధరలకు విక్రయించేవారు. అంతేకాకుండా రద్దీ ప్రాంతాలు, పీఏసీ కేంద్రాల్లో భక్తుల సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి పలు బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

భక్తులు వసతి గదుల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ సీవీఎస్ఓ, తిరుపతి ఎస్పీ కోరారు. గదులు, సేవలను కేవలం అధికారిక కౌంటర్లు లేదా వెబ్‌సైట్ ద్వారానే పొందాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసు అత్యవసర నంబర్ 112, టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 155257, లేదా విజిలెన్స్ హెల్ప్‌లైన్ 9866898630 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.