అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయిన నేపథ్యంలో, పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ మాక్ అసెంబ్లీ ప్రారంభమవుతోంది.
ఈ నమూనా అసెంబ్లీలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ స్పీకర్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ప్రతిపక్ష నేత పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై పార్టీలో ఇంకా స్పష్టత రాలేదు.
సభలో కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారనే కారణంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ చర్యను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం, తమను సభలో లేకుండా చేసిందని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి అంశాలపై ఈ వేదిక ద్వారా చర్చ జరగనుంది. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా లేక అర్థవంతమైన చర్చ జరుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తోంది. మనస్పర్థలను పక్కన పెట్టి, ఎన్నికల్లో గెలిస్తే తగిన గుర్తింపు ఉంటుందని నేతలకు సూచిస్తున్నారు.








