తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రూపొందించిన ‘డీసీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల వసూళ్లను దాటింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, నిర్మాత కళానిధి మారన్ చిత్ర బృందానికి బహుమతులు ప్రకటించారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని దర్శకుడు అరుణ్ మథేశ్వరన్, నటుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్లకు కళానిధి మారన్ ఖరీదైన బిఎమ్డబ్ల్యూ కార్లను బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వీడియోల రూపంలో పంచుకుంది.
గతంలో ‘జైలర్’ సినిమా భారీ విజయం సాధించినప్పుడు కూడా నిర్మాత కళానిధి మారన్ ఇదే తరహాలో స్పందించారు. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్లకు ఆయన లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చారు.
అయితే, ‘డీసీ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన వామికా గబ్బీకి ఎలాంటి బహుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి, అంతేకాదు ఆమె పాత్ర సినిమా విజయానికి ప్రధాన కారణమని చాలామంది భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, హీరోయిన్ను పక్కన పెట్టడంపై నెటిజన్లు సన్ పిక్చర్స్ తీరును తప్పుబడుతున్నారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన వామికా గబ్బీకి కనీసం ఒక చిన్న బహుమతి కూడా ఇవ్వలేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.








