భారత మార్కెట్లోకి Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా సంస్థ ప్రవేశపెట్టింది. 6GB RAM మరియు 128GB స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. ప్యాంటోన్ అలాస్కాన్ బ్లూ, మాలాగా, స్టార్‌గేజర్ అనే మూడు రంగుల్లో ఇది లభిస్తుంది.

ఈ ఫోన్ ఆగస్టు 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి వస్తుంది. ప్రముఖ బ్యాంక్ కార్డులను ఉపయోగించే వారికి రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది, అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

దీనిలో 7000mAh భారీ బ్యాటరీని అమర్చారు, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 63 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 30W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ రక్షణ కోసం సైనిక స్థాయి ప్రమాణాలతో కూడిన MIL STD 810H డిజైన్, నీటి చుక్కలు, దుమ్ము నుంచి రక్షణ ఇచ్చే IP64 రేటింగ్ ఇచ్చారు.

ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌కు రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని మోటరోలా హామీ ఇచ్చింది.