న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇరాన్ సుప్రీం లీడర్, హెజ్బొల్లా చీఫ్, టర్కీ అధ్యక్షులతో పాటు మమ్దానీ ఫోటోను ఒకే ప్రచార పోస్టర్పై ఉంచి, నెతన్యాహును వ్యతిరేకించే వారిని గెలవనివ్వొద్దని ఆయన పార్టీ లికుడ్ పిలుపునిచ్చింది. రాబోయే ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థులను ఇజ్రాయెల్కు ముప్పుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం సాగుతోంది.
గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులను మమ్దానీ బహిరంగంగా విమర్శిస్తున్నారు. నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా పేర్కొన్న ఆయన, నెతన్యాహు హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (యుద్ధ నేరాలను విచారించే అంతర్జాతీయ న్యాయస్థానం) ఎదుట ఉండాలని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్లో నెతన్యాహు న్యూయార్క్ వచ్చినప్పుడు, ఆ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ను అమెరికా అధికారులు అమలు చేయాలని కూడా మమ్దానీ కోరారు.
మమ్దానీ వ్యాఖ్యలపై నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. న్యూయార్క్లో మతాల మధ్య ద్వేషాన్ని మమ్దానీ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మమ్దానీ వంటి నేతల ప్రభావంతో అమెరికాలోని డెమోక్రాట్ పార్టీ సభ్యులకు ఇజ్రాయెల్ పట్ల మద్దతు తగ్గే ప్రమాదం ఉందని నెతన్యాహు హెచ్చరించారు. అక్టోబర్లో జరగనున్న జాతీయ ఎన్నికల కోసం నెతన్యాహు తన కూటమిని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు.
మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా తమను ఆశ్చర్యపరచకముందే, తామే ముందుగా దాడి చేస్తామని ఆయన ప్రకటించారు. ఏ దేశంపైనైనా అవసరమైతే ఎప్పుడైనా దాడి చేసే హక్కు ఇజ్రాయెల్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతినిధి జారెడ్ కుష్నర్ నెతన్యాహుతో మూడు గంటల పాటు చర్చలు జరిపినప్పటికీ, ఎలాంటి పురోగతి రాలేదు. హమాస్ నిరాయుధీకరణ జరిగే వరకు గాజా నుంచి బలగాలను ఉపసంహరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. దీంతో కాల్పుల విరమణ చర్చలు మళ్లీ సంక్లిష్టంగా మారాయి.








