అమరావతి: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డిసిపి కూతురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని నల్లపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... విజయవాడ ట్రాఫిక్ డిసిఫి షిరీన్ బేగం కూతురు షేక్ అసిఫా(24) తన ఐదుగురు స్నేహితులతో కలిసి చీరాలకు కారులో బయలుదేరారు.

ఏటుకూరు గ్రామ శివారులో ముందున్న లారీ సడన్‌గా బ్రేక్ వేయడంతో లారీ ఆగింది. కారు నడుపుతున్న అవినాష్ వేగాన్ని నియంత్రించలేక లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ముందుభాగంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వెనుక సీట్లో కూర్చున్న అసిఫా తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.