కాకినాడలో కొవ్వూరి సౌజన్య ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆమె రాసిన ఐదు పేజీల లేఖ ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. తన మరణానికి ముందు రాసిన ఈ లేఖలో సాదిక్ అనే వ్యక్తిపై సౌజన్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, వాటిని అడ్డుపెట్టుకుని సాదిక్ తనను బెదిరింపులకు గురిచేశాడని ఆమె పేర్కొంది.
తన భర్తతో ఉన్న వ్యక్తిగత సమస్యల సమయంలో సాదిక్ తనకు అండగా ఉంటానని నమ్మించి దగ్గరయ్యాడని సౌజన్య లేఖలో వివరించింది. తాను ఎదిరించిన ప్రతిసారీ సాదిక్ తనపై దాడి చేసేవాడని, ఈ వేధింపులతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపింది. తన కుమారుడు చదివే స్కూలుకు సాదిక్ ట్రైనర్గా వచ్చి ఒత్తిడి పెంచాడని, బాబుకు హాని చేస్తానని బెదిరించేవాడని ఆమె ఆరోపించింది.
తన భర్తకు విదేశాల నుంచి తెప్పించిన ప్రాణాంతక రసాయనాన్ని ఇచ్చి సాదిక్ చంపేశాడని సౌజన్య లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. తన ఇంటి తాళాలు, బ్యాంకు లాకర్లు, ఫోన్లు, ఆస్తి పత్రాలు అన్నీ సాదిక్ ఆధీనంలో ఉన్నాయని, తన ఆస్తిపై అతడికి కన్ను ఉందని ఆమె పేర్కొంది. తనను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఉప్పాడ సముద్రతీరానికి తీసుకెళ్లి నీటిలో తోసేశాడని కూడా ఆమె రాసింది.
పోలీసు శాఖలో పరిచయాలు ఉన్నాయని, ఫిర్యాదు చేస్తే తప్పుడు కేసులు పెట్టిస్తానని సాదిక్ బెదిరించేవాడని సౌజన్య తెలిపింది. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా తప్పుడు ఆధారాలు సృష్టిస్తానని కూడా అతను భయపెట్టేవాడని ఆమె పేర్కొంది. తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతో తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని లేఖలో వివరించింది.
సౌజన్య లేఖలో చేసిన ఈ ఆరోపణలన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయి. ఈ అంశాలు కేసు విచారణలో ఎంతవరకు కీలకంగా మారుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు భారత ప్రభుత్వం అందించే జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330 లేదా సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 18005990019 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.







