గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారిణులు సత్తా చాటారు. జూలై 27న జరిగిన మహిళల వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో గ్నానేశ్వరి యాదవ్ రజత పతకాన్ని, బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
మహిళల 53 కిలోల విభాగంలో గ్నానేశ్వరి యాదవ్ మొత్తం 199 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. నైజీరియాకు చెందిన ఒనోమే దిదీహ్తో హోరాహోరీగా సాగిన ఈ పోటీలో, గ్నానేశ్వరి స్నాచ్లో 88 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 111 కిలోలు ఎత్తి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. మరోవైపు 58 కిలోల విభాగంలో పోటీపడిన బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. 2022 బర్మింగ్హామ్ క్రీడల్లోనూ పతకం సాధించిన బింద్యారాణి, వరుసగా రెండోసారి కామన్వెల్త్ పోడియంపై నిలిచి తన నిలకడను చాటుకున్నారు.
ఈ రెండు విజయాలతో గ్లాస్గో క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. బాక్సింగ్లో ఇప్పటికే ఒక పతకం ఖాయం కాగా, సచిన్ సివాచ్, అంకుష్, సాక్షి చౌదరి క్వార్టర్ ఫైనల్కు చేరుకుని పతకాల రేసులో కొనసాగుతున్నారు.
ఐదో రోజు పోటీలు ఇంకా కొనసాగుతుండటంతో భారత్కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. పురుషుల 79 కిలోల వెయిట్లిఫ్టింగ్లో వి. అజయ బాబు, హైజంప్ ఫైనల్లో ముగ్గురు అథ్లెట్లు, 110 మీటర్ల హర్డిల్స్లో తేజస్ షిర్సే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.




