తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం మెట్రో రైలు సేవలను స్వయంగా పరిశీలించారు. ఒమందూరార్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన, ప్రత్యేక సౌకర్యాలను కోరుకోకుండా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి సాధారణ ప్రయాణికుడిలాగే టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం భద్రతా సిబ్బందితో కలిసి ప్లాట్ఫామ్కు చేరుకుని మెట్రో రైలు ఎక్కారు.
విజయ్ వస్తున్నారనే సమాచారంతో అభిమానులు స్టేషన్ కారిడార్లలో భారీగా గుమిగూడారు. బారికేడ్ల వెనుక నిలబడి నినాదాలు చేస్తున్న అభిమానులకు ఆయన చిరునవ్వుతో అభివాదం చేశారు. ఆటోమేటిక్ టికెట్ గేట్ వద్ద తన టోకెన్ను స్కాన్ చేసి రైలులోకి ప్రవేశించిన ఆయన, ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో ఆత్మీయంగా మాట్లాడారు. ఒక మహిళా ప్రయాణికురాలిని, చిన్నారిని పలకరించి, కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుల బృందంతో కాసేపు ముచ్చటించారు.
మెట్రో ప్రయాణం ముగిసిన తర్వాత విజయ్ మెట్రో కంట్రోల్ రూమ్ను సందర్శించారు. అక్కడ ఉన్న డిజిటల్ డిస్ప్లే స్క్రీన్ల ద్వారా రైళ్ల కదలికలు, నెట్వర్క్ మ్యాప్లు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. మెట్రో సేవల నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో స్టేషన్ మెట్ల మార్గాలు, వీక్షణ ప్రాంతాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడంతో మెట్రో స్టేషన్ ఫ్యాన్ మీట్ను తలపించింది. అభిమానులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. చెన్నై మెట్రో సేవల పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఈ పర్యటన చేపట్టారు.








