Btatti Vikramarka | హైదరాబాద్‌, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణిపై కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ, రిటైర్డ్‌ ఉద్యోగిని ఎస్‌కే ప్రసన్నకుమారి చేసిన ఆరోపణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఒక రిటైర్డ్‌ ఉద్యోగినికి రావాల్సిన బెనిఫిట్స్‌ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని తాను భట్టి విక్రమార్క సతీమణి వద్ద ప్రస్తావించగా, ఆమె 10% కమీషన్‌ అడిగారని ప్రసన్నకుమారి ఆరోపించారు. రూ.40 లక్షల పెండింగ్‌ బిల్లుల విడుదలకు రూ.నాలుగు లక్షలు డిమాండ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇందిరాపార్‌ వద్ద రిటైర్డ్‌ ఉద్యోగులు చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ బకాయిలు, పెండింగ్‌ బిల్లుల విడుదల విషయంలో రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నామని, ఉన్నతస్థాయి నేతల కుటుంబసభ్యులే తమకు న్యాయంగా రావాల్సిన సొమ్మును కమీషన్‌తో ముడిపెడితే ఎలా? అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

రిటైర్మెంట్ డబ్బులు విడుదల చేయడానికి భట్టి విక్రమార్క భార్య నా దగ్గర 10 శాతం లంచం అడిగింది

Video Credits – Mic News pic.twitter.com/xXn9G9p9kh

— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026

ప్రభుత్వ విధానాలు, ఉద్యోగుల సమస్యల పరిషారంలో జరుగుతున్న జాప్యంపై రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో సుమారు రూ.120 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లులు చెల్లించేందుకు 6% నుంచి 10% వరకు కమీషన్లు ఇవ్వాలని, లేకుంటే ఫైలు కదలదని, బిల్లులు చెల్లించని దుస్థితి ఉన్నదని ప్రసన్నకుమారి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘం నాయకురాలే డిప్యూటీ సీఎం భార్యపై లంచం అడిగారంటూ ఆరోపణలు గుప్పించడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. దీనిపై అధికారిక వర్గాల నుంచి స్పందన రావాల్సి ఉన్నది.