బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 6న అట్టహాసంగా మొదలైంది. ఈ రియాలిటీ షోలో మొదటి కంటెస్టెంట్‌గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇవ్వగా, ఆ తర్వాత రెండో కంటెస్టెంట్‌గా నటుడు త్రిగుణ్ వేదికపైకి వచ్చాడు.

హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. గత 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న త్రిగుణ్, 2009లో 'కథ' సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ తర్వాత అతనికి వరుస అవకాశాలు దక్కాయి.

తెలుగు, తమిళ భాషల్లో హీరోగా మరియు కీలక పాత్రల్లో త్రిగుణ్ దాదాపు 30 సినిమాల్లో నటించాడు. 'తుంగభద్ర', 'గరుడవేగా', '24 కిసెస్', 'చీకటి గదిలో చితక్కొట్టుడు', 'డియర్ మేఘ', 'లైన్ మ్యాన్', 'ఈషా', 'చెన్నై లవ్ స్టోరీ' వంటి చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోనూ అతను కనిపించాడు.

ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న త్రిగుణ్, సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు. అయితే, ఇన్ని సినిమాల్లో నటించిన త్రిగుణ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం గమనార్హం. తాను అందరిలో ఒకడిలా ఉంటానని అతను చెప్పుకొచ్చాడు.

హౌస్‌లోకి వెళ్లే ముందు నాగార్జున త్రిగుణ్‌కు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ హౌస్‌లో దయ్యం ఉందని వారం రోజుల్లో కనీసం ముగ్గురు సభ్యులు నమ్మేలా చేయాలనేది ఆ టాస్క్. తన ఏడాది వయసున్న బాబును వదిలి ఈ షో కోసం వచ్చానని నాగార్జునతో మాట్లాడుతూ త్రిగుణ్ తెలిపాడు.

సిల్వర్ స్క్రీన్ అంటే వెండితెరపై ప్రేక్షకులను అలరించిన త్రిగుణ్, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ అంటే టీవీ తెరపై బిగ్ బాస్ హౌస్‌లో ఎలా సత్తా చాటుతాడో వేచి చూడాలి.