Telugu » Andhrapradesh » Centre Gives Green Signal To Vijayawada And Vizag Metro Rail Projects
Centre gives green signal to Vijayawada and Vizag Metro rail projects.
Ap Metro Rail: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ఎట్టకేలకు కీలక దశకు చేరుకున్నాయి. అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ రెండు ప్రధాన నగరాల్లో సురక్షితమైన, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత ఆవశ్యకముగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కేంద్రానికి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (DPR) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆర్థిక మదింపు దశకు చేరుకోవడంతో ఈ భారీ ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది.
మొత్తం రూ. 21,616 కోట్ల భారీ వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర తొలిదశ మెట్రో (Ap Metro Rail)నెట్వర్క్ను నిర్మించాలని ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య విధానంలో చెరో 20 శాతం నిధులు సమకూర్చనుండగా, మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల రుణాల ద్వారా సేకరించనున్నారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ నుండి నగర పరిసర ప్రాంతాలకు, అలాగే విజయవాడలోని గన్నవరం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి.
విజయవాడలో మెట్రో స్టేషన్లు, కోచ్ డిపోల కోసం 80 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన అధికారులు, ‘సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ సర్వేను ఇప్పటికే ప్రారంభించారు. బందరు, ఏలూరు రోడ్లు సహా గన్నవరం పరిసరాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక మదింపు పూర్తి కావడమే కాకుండా, టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందస్తు అనుమతులు ఇవ్వడంతో త్వరలోనే మెట్రో పనులకు పునాది పడనుంది.







