మాదాపూర్, వెలుగు: ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఓ కంపెనీ.. ఆఫీస్ రినోవేషన్ పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ దేశాయ్పేటకు చెందిన రాహుల్(26) మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నాన్ ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం తన ప్రొఫైల్ను లింక్డిన్లో పెట్టాడు. మే 22న అన్వేష్ అలియాస్ అడప శివశంకర్బాబు అనే వ్యక్తి రాహుల్కు ఫోన్ చేసి.. మాదాపూర్ కావూరి హిల్స్లోని అర్క బ్రాంకోమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు. జాబ్ గ్యారెంటీ కోసం డబ్బులు చెల్లించాలని చెప్పడంతో రాహుల్ దశలవారీగా అన్వేష్ భార్య సంధ్యారాణి ఫోన్పే నంబర్కు, కొంత నగదు రూపంలో కలిపి రూ.2.50 లక్షలు చెల్లించాడు.
డబ్బులు చెల్లించిన అనంతరం కంపెనీ ఆఫీసుకు వెళ్లిన రాహుల్కు ఆఫర్ లెటర్ ఇచ్చారు. అనంతరం 20 రోజులపాటు ఆఫీస్ రినోవేషన్ జరుగుతుందని, అప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్లో శిక్షణ ఇస్తామని అన్వేష్ చెప్పాడు. ఆ తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి ఫోన్, మెయిల్ రాకపోవడంతో రాహుల్ అన్వేష్కు ఫోన్ చేయగా స్పందించలేదు.
దీంతో కంపెనీ కార్యాలయానికి వెళ్లి చూడగా అది మూసి ఉంది. అక్కడ మరికొందరు నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించి మోసపోయినట్లు రాహుల్ గుర్తించాడు. దీంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. రాహుల్ మాదిరిగా దాదాపు 20 మంది ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అన్వేష్కు చెల్లించినట్లు గుర్తించారు.
గతంలో 13 మందిని పెళ్లి చేసుకుని మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన అన్వేష్పై సైబరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నాయి. విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటూ, వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన అన్వేష్ను గచ్చిబౌలి పోలీసులు 2022 జులైలో అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన అన్వేష్(33) మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా విడాకులు తీసుకున్న మహిళలను పరిచయం చేసుకునేవాడు.
తాను కూడా విడాకులు తీసుకున్నానని నమ్మించి వారిని పెళ్లి చేసుకునేవాడు. ఇలా ఇప్పటివరకు 13 మంది మహిళలను పెళ్లి చేసుకుని వేర్వేరు ప్రాంతాల్లో కాపురాలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి అనంతరం అమెరికాలో ఉద్యోగం వచ్చిందని, వెళ్లేందుకు డబ్బులు అవసరమంటూ వారి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో ఇటీవల కొండాపూర్కు చెందిన ఓ మహిళ వద్ద రూ.32 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిసింది.








