అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఇకపై నాలుగేళ్ల గడువు మాత్రమే ఉంటుంది. ఈ సమయం ముగిసిన తర్వాత విద్యార్థులు తమ వీసాను మళ్లీ పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన వల్ల భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాల నుంచి వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిర్ణీత నాలుగేళ్ల గడువును దాటితే విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయి. గడువును మిస్ అయిన వారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు అమెరికా వీసా నిషేధం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యార్థులు తమ విద్యా సంస్థల ద్వారా వీసా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

వీసా పునరుద్ధరణ కోసం విద్యార్థులు నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారాలనుకునే విద్యార్థులు ముందుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ నిబంధనలు విద్యార్థుల విద్యా ప్రయాణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.