స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒప్పో (Oppo) మరియు వన్‌ప్లస్ (OnePlus) కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో వెలువడిన సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థలు 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీలతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

ప్రస్తుతం వన్‌ప్లస్ ఈ భారీ బ్యాటరీ ఫోన్‌పై ప్రాథమిక పరిశోధనలు చేస్తోంది. మరోవైపు, ఒప్పో తన 'A' సిరీస్‌లో భాగంగా 10,000mAh సింగిల్-సెల్ బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్‌ప్లస్ వచ్చే ఏడాది 'ప్రో' బ్రాండింగ్‌తో, SM8845 మోడల్ నంబర్‌తో 10,000mAh కంటే పెద్ద బ్యాటరీ కలిగిన మిడ్-రేంజ్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ కంపెనీలు గతంలో కూడా భారీ బ్యాటరీలతో ఫోన్లను విడుదల చేశాయి. గతంలో ఒప్పో A6 ప్రో 5G ఫోన్‌ను 7,000mAh బ్యాటరీ, 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారత్‌లో రూ.21,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 మోడల్‌ను 9,000mAh బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో రూ.38,999 ధరకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ వివరాలను ఏ సంస్థా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, ఈ కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తే, ఆయా సంస్థల చరిత్రలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లుగా ఇవి రికార్డు సృష్టిస్తాయి.