మార్కాపురం జిల్లా, పొదిలి మండలం ఈగలపాడులో గత కొన్నేళ్లుగా వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను విస్మరించడం, గ్రామదేవతలకు ధూపదీప నైవేద్యాలు ఆపేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ తప్పును సరిదిద్దుకునేందుకు గ్రామస్థులు పూనుకున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి, గ్రామదేవతల విగ్రహాలకు జలాభిషేకం చేశారు. పసుపు, కుంకుమ, పూలు, నిమ్మకాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్షాలు కురవాలని మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామదేవతల విగ్రహాలకు సరైన రక్షణ, సౌకర్యాలు లేకపోవడం వల్ల అవి ఎండకు, వానకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవతలను పట్టించుకోకపోవడమే వర్షాలు లేకపోవడానికి కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
గ్రామదేవతలకు ప్రత్యేకంగా గుడులు నిర్మించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గుడి నిర్మిస్తే నిత్యం పూజలు జరుగుతాయని, తద్వారా గ్రామం సుభిక్షంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఇకపై ఏ పని మొదలుపెట్టినా గ్రామదేవతల మొక్కులు తీర్చుకున్నాకే చేయాలని నిర్ణయించుకున్నారు.







