విజయవాడలోని విఆర్ సిద్ధార్థ యూనివర్శిటీలో గురువారం హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు అండర్-21 వాలీబాల్ ఓపెన్ ట్రయల్స్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి హైదరాబాద్ బ్లాక్హాక్స్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్రంలో క్రీడలను గ్రాస్ రూట్ స్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ శాప్ (SAAP) చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, విజయవాడలో ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన బ్లాక్హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి కంకనాలకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల భవిష్యత్తు కోసం సంస్థకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
హైదరాబాద్ బ్లాక్హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ చాలా కాలంగా ఉన్న ప్రణాళికలతో వాలీబాల్ క్రీడను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ప్రతి ఏటా టాలెంట్ హంట్ నిర్వహించడం, జిల్లా మరియు గ్రామీణ స్థాయి టోర్నీలకు మద్దతు ఇవ్వడం, జాతీయ అంతర్జాతీయ నిపుణులతో కోచ్లకు శిక్షణ ఇప్పించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రొఫెషనల్ అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ ట్రయల్స్ ప్రక్రియలో భాగంగా అండర్-21 విభాగంలో 105 మంది, ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఓపెన్ ట్రయల్స్లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్పాన్సర్షిప్ అందించడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని అభిషేక్ రెడ్డి వెల్లడించారు.








