వర్షాకాలంలో వాతావరణం, నేలలో ఉండే అధిక తేమ కారణంగా ఆకుకూరల నాణ్యత దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో శరీరంలో జీర్ణశక్తి మందగించడం వల్ల, తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

మునగాకు, చామకూర వంటి వాటిని ఈ సమయంలో తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. మునగ చెట్టు అధిక తేమను పీల్చుకోవడం వల్ల ఆకులు చేదుగా మారడమే కాకుండా, వాటిలో బాక్టీరియా, పురుగులు చేరే అవకాశం ఉంది. అలాగే చామకూరలో ఉండే కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు వర్షాకాలంలో పెరిగి, సరిగ్గా ఉడికించకపోతే గొంతులో మంట, దురద, కడుపులో అలర్జీ వంటి సమస్యలకు దారితీస్తాయి.

తోటకూర, పాలకూర వంటి సాధారణ ఆకుకూరల కాడల్లో తేమ నిలిచిపోవడం వల్ల పురుగులు, క్రిములు గుడ్లు పెట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిలోని కొన్ని మూలకాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి గ్యాస్, కడుపునొప్పి వంటి ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి.

ఆకుకూరలను వండే ముందు ఉప్పు, పసుపు కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టి శుభ్రంగా కడగడం మంచిది. అలాగే ఆకుకూరలను సగం ఉడికించకుండా, పూర్తిగా బాగా ఉడికించిన తర్వాతే ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.