కెనడాలోని నియాగరా-ఆన్-ది-లేక్లో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అనహత్ సింగ్ 11-3, 11-7, 11-9 స్కోరుతో ఈజిప్టుకు చెందిన రూకయ్యా సలీమ్ను ఓడించారు. ఈ విజయంతో మహిళల విభాగంలో గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈజిప్ట్ ఆధిపత్యానికి అనహత్ తెరదించారు. 2010లో అమెరికా క్రీడాకారిణి అమాండా సోబీ తర్వాత, ఈజిప్ట్ దేశానికి చెందని మొదటి మహిళా ఛాంపియన్గా ఈ టీనేజర్ చరిత్ర సృష్టించారు.
ఈ టోర్నీలో అనహత్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. సెమీఫైనల్లో మరో ఈజిప్ట్ క్రీడాకారిణి బార్బ్ సమేహ్ను నాలుగు గేమ్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. ఈ విజయం భారత స్క్వాష్ క్రీడా చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. 2011 నుండి కొనసాగుతున్న ఈజిప్ట్ ఛాంపియన్ల పరంపరను అనహత్ అడ్డుకున్నారు.
ఈ చారిత్రక విజయంపై భారత క్రికెటర్ శిఖర్ ధవన్ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా స్పందించారు. భారత క్రీడా చరిత్రలో ఇది అద్భుతమైన ఘట్టమని, భవిష్యత్ తరాలకు అనహత్ స్ఫూర్తిగా నిలవాలని ఆయన అభినందించారు.
మరోవైపు, పురుషుల విభాగంలో ఈజిప్ట్ క్రీడాకారుల ఆధిపత్యం కొనసాగుతోంది. టాప్ సీడ్ మొహమద్ జకరియా వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరుకోగా, ఆయనతో ఆడమ్ హవాల్ తలపడనున్నారు. సెమీఫైనల్లో గాయంతో మార్వాన్ అస్సల్ వైదొలగడంతో హవాల్ ఫైనల్కు అర్హత సాధించారు.








