TIMS : హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే రోగులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంగళవారం నాడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో జరిగింది. ఈ భేటీలో ఆసుపత్రి అభివృద్ధి, కొత్త సేవల ప్రారంభం , మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు ఆసక్తికరమైన నిర్ణయాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం టిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ సగటున 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, వారికి నాణ్యమైన వైద్య సేవలతో పాటు డే కేర్ ప్రొసీజర్లను కూడా అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మంత్రికి వివరించారు. రోగులకు మెరుగైన ఆపరేషన్ సేవలు అందించేందుకు ఆసుపత్రిలోని ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు , డయాగ్నస్టిక్ పరికరాలను పూర్తిస్థాయిలో స్టెరిలైజేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పూర్తిస్థాయి సర్జరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
టిమ్స్లో వైద్యులు, సిబ్బంది నియామకాల కోసం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సర్వీస్ రూల్స్ను అనుసరించాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది. దీనికి తోడు నిమ్స్లో అమలులో ఉన్న చవకైన, సమగ్రమైన టారిఫ్లనే టిమ్స్లో కూడా అమలు చేయడానికి ఆమోదం తెలిపారు. దీనివల్ల రెండు ప్రధాన ప్రభుత్వ వైద్య సంస్థల మధ్య చార్జీల విధానంలో ఏకరూపత రావడంతో పాటు, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. అలాగే ఆసుపత్రి ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (TRA) ద్వారా నిర్వహించేందుకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేసేందుకు ఈసీ ఆమోదముద్ర వేసింది.
రోగులు, వారి సహాయకులు , ఆసుపత్రి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులను భారీగా విస్తరించనున్నారు. ఆసుపత్రికి వచ్చే వాహనాల కోసం మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటుతో పాటు రోగుల సహాయకుల సౌకర్యార్థం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించే ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, నిమ్స్ తరహాలోనే టిమ్స్లోనూ పీజీ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న నేపథ్యంలో, పీజీ వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ను అత్యాధునిక వైద్యం, వైద్య విద్య , పరిశోధనలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.








