భారతదేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాల ప్యాకెట్లపై ఎరుపు రంగు షట్కోణ ఆకారం (Hexagon) ఉన్న హెచ్చరిక లేబుల్‌లను ముద్రించాలని ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రతిపాదించింది. సంతృప్త కొవ్వు, చక్కెర లేదా ఉప్పు వంటి పోషకాలలో కనీసం రెండు పదార్థాలు అధికంగా ఉన్న ఉత్పత్తులపై ఈ లేబుల్స్ ఉంటాయి. ఈ విషయాన్ని శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన ఫైలింగ్‌లో FSSAI వెల్లడించింది.

ఈ ప్రతిపాదన ద్వారా వినియోగదారులు అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఉన్న ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చని సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, ఇతర బలహీన వర్గాల ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని వివరించింది. ప్రస్తుతం కంపెనీలు ప్యాకెట్ల వెనుక భాగంలో కేవలం పదార్థాల జాబితాను, ప్రాథమిక పోషకాహార సమాచారాన్ని మాత్రమే ముద్రిస్తున్నాయి.

కోకా-కోలా, నెస్లే, పెప్సికో వంటి దిగ్గజ కంపెనీలు ఈ లేబులింగ్‌ను చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి లేబుల్స్ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయని, ఆహార ఎంపికలను మార్చడంలో ఇవి ప్రభావవంతంగా ఉండవని మార్చి 19న జరిగిన సమావేశంలో కోకా-కోలా ఇండియా ఎగ్జిక్యూటివ్ మిలి భట్టాచార్య వాదించారు. కంపెనీల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం గతంలో ఈ ప్రతిపాదనను విరమించుకుంది.

అయితే, యూరోపియన్ దేశాల్లో కోకా-కోలా, నెస్లే వంటి కంపెనీలు స్వచ్ఛందంగానే ఇలాంటి లేబుల్స్ వాడుతున్నాయని తెలిసి ప్రజలు, ఆరోగ్య నిపుణులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ఊబకాయం సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వేగంగా చర్యలు తీసుకోవాలని ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది.

ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, తమ నిపుణుల బృందం దీనిపై సమీక్ష జరుపుతుందని '3S అండ్ అవర్ హెల్త్' సంస్థ ప్రధాన న్యాయవాది రాజీవ్ శంకర్ ద్వివేది తెలిపారు. హెచ్చరిక లేబుల్స్ లేని కారణంగా ఆయన సుప్రీంకోర్టులో ప్రభుత్వాన్ని సవాలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలను భారతదేశంలో అమలు చేయడం కష్టమని FSSAI గతంలో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒత్తిడితో కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది.