Nikhil | ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘స్వయంభు’ ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో బ్యానర్‌పై భువన్, శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ తొలిసారి ఓ పవర్‌ఫుల్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు.

తిరుపతి పరిసర ప్రాంతాలకు సంబంధించిన రాజుల కాలం నాటి ఓ ఆసక్తికరమైన ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిఖిల్ గతంలో వెల్లడించాడు. కథకు తగ్గట్టుగా భారీ యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించడమే కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లో భారీగా శ్రమించినట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు కథానాయిక సంయుక్త కూడా సినిమాలో యుద్ధ సన్నివేశాల్లో పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీంతో ‘స్వయంభు’లో హీరో, హీరోయిన్ పాత్రలు రెండూ యాక్షన్‌కు ప్రాధాన్యత కలిగినవిగానే ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే చిత్ర విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

విడుదల తేదీపై స్పష్టత లేకపోయినా.. ‘స్వయంభు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుందనే విషయంలో మాత్రం ఓ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. ఇటీవల నిఖిల్ తన ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో బైట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోకు ఓ అభిమాని స్పందిస్తూ.. సినిమా కథ తిరుపతి బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించినది కాబట్టి, ‘స్వయంభు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా తిరుపతిలోనే నిర్వహించాలని కోరాడు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో సినిమాకు మరింత మంచి జరుగుతుందని తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపాడు.ఈ కామెంట్‌కు నిఖిల్ స్వయంగా స్పందిస్తూ ‘అక్కడికి కచ్చితంగా వస్తాము’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ‘స్వయంభు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోనే జరగబోతుందనే ప్రచారం ఊపందుకుంది. నిఖిల్ ఇచ్చిన ఈ రిప్లైతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సినిమా కథకు తిరుపతితో సంబంధం ఉండటంతో, అదే ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే సినిమాకు మరింత ప్రత్యేకత వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.