మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.
ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.
పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.
మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.
చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.
ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!
Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv
— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026
ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.








