Mahesh Babu | టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో సందడి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు మహేశ్‌కు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మహేశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ మేకర్స్ కూడా స్పెషల్ స్టిల్స్ విడుదల చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. అయితే వీటన్నింటికంటే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బర్త్‌డే విషెస్ ఇప్పుడు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సందీప్ రెడ్డి వంగా ఓ ఆసక్తికరమైన వీడియోను రూపొందించారు. ఇందులో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ చిత్రంలోని ఐకానిక్ డైలాగ్‌ను ఏఐ టెక్నాలజీ సాయంతో రీక్రియేట్ చేశారు.

ఆ విజువల్‌లో మహేశ్ బాబును చూపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణగారి డైలాగ్‌కు మహేశ్ బాబు లుక్‌ను జోడించడం వల్ల ఈ వీడియోకు మరింత ప్రత్యేకత వచ్చింది. వీడియోను చూసిన మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణగారి పాత డైలాగ్‌ను ఆయన కుమారుడు మహేశ్ బాబుతో అనుసంధానం చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన విషెస్ మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌పై చర్చకు తెరలేపాయి. మహేశ్ బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే వార్తలు గతంలోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ ప్రాజెక్ట్‌కు ‘డెవిల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన ఈ బర్త్‌డే పోస్ట్‌తో మరోసారి ‘డెవిల్’ ప్రాజెక్ట్‌పై చర్చ మొదలైంది.ప్రస్తుతం మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ పనుల్లో ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మహేశ్–సందీప్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు స్టార్‌డమ్‌కు సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ తోడైతే సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే నెలకొంది. సందీప్ గత చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ భారీ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.