ఆపదను అరువు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ విదేశీ అడవి జంతువుల బెడద తీవ్రరూపం దాల్చింది. భారతదేశానికి చెందిన అతిపెద్ద యాంటీలోప్ జాతికి చెందిన ‘నీల్గాయ్’ జంతువుల సంఖ్య అక్కడ అనియంత్రితంగా పెరిగిపోయింది. క్రమంగా తమ సంఖ్యను పెంచుకున్న నీల్గాయ్‌లు.. ఇప్పుడు స్థానిక వణ్యప్రాణులు, రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

సుమారు వంద సంవత్సరాల క్రితం మాంసం ఉత్పత్తి, ప్రయోగాల కోసం కొన్ని నీల్గాయ్ జంతువులను భారత్ నుంచి టెక్సాస్‌కు తీసుకెళ్లారు. అయితే దక్షిణ టెక్సాస్ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం వీటి మనుగడకు అత్యంత అనుకూలంగా మారడంతో ఇవి వేగంగా సంతానోత్పత్తి చేశాయి.

ఆ ప్రాంతంలో వీటిని వేటాడే సహజ శత్రువులు అంటే క్రూర మృగాలు వంటివి లేకపోవడం ఈ నీల్గాయ్ జనాభా విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. భారత్‌ నుంచి తీసుకెళ్లిన ప్రారంభంలో కేవలం పదుల సంఖ్యలో ఉన్న ఈ జీవులు, కాలంతో పాటు క్రమంగా తమ సంఖ్యను పెంచుకుంటూ ప్రస్తుతం 50 వేలకు పైగా చేరినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ విపరీతమైన పెరుగుదల ఇప్పుడు స్థానికంగా నివసించే వణ్య ప్రాణులకు, రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇవి ఆహారం, నీటి కోసం స్థానిక వన్యప్రాణులతో పోటీ పడుతుండటంతో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయండంతో పాటు సరిహద్దులను దాటి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయ పంటలను పాడు చేస్తున్నాయి. అంతేకాదు ఈ నీల్గాయ్‌ల ద్వారా స్థానిక పశువులకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, కొందరు వ్యాపారులు ఈ నీల్గాయ్‌ల వేటను లాభసాటి టూరిజంగా మలుచుకుంటున్నప్పటికీ, వీటి సంఖ్యను పూర్తిగా అదుపు చేసేందుకు అధికారుల వద్ద స్పష్టమైన నివారణ ప్రణాళిక కొరవడింది. రోజురోజుకూ పెరుగుతున్న నీల్గాయ్ ముప్పుతో స్థానిక రైతులు, నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.