దర్శకుడు మణిరత్నం తన కొత్త రొమాంటిక్ డ్రామా షూటింగ్‌ను కోల్‌కతాలో ప్రారంభించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'నవాబ్' సినిమాలో విజయ్ సేతుపతి నటించగా, సాయి పల్లవి ఆయనతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి.

ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. కొన్నేళ్లుగా గడ్డంతో కనిపిస్తున్న ఆయన, ఈ పాత్ర కోసం క్లీన్ షేవ్ లుక్‌లోకి మారారు. ఈ ప్రాజెక్టుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కోల్‌కతాతో పాటు విశాఖపట్నం, పుదుచ్చేరి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. కంట్రోల్ బడ్జెట్‌తో కేవలం 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని మణిరత్నం ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

గతేడాది విడుదలైన 'థగ్ లైఫ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో, ఈ కొత్త లవ్ స్టోరీతో మణిరత్నం బలమైన కంబ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.