హరారే వేదికగా శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ స్టార్‌ తిలక్‌ వర్మ తన బ్యాటింగ్‌తో విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట‌య్యాక క్రీజులోకి వచ్చిన తిలక్, ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.

ఈ మ్యాచ్‌లో తిలక్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లో 9వ టీ20 హాఫ్ సెంచరీ. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొన్న తిలక్, 5 ఫోర్లు మరియు 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా అద్భుతంగా రాణించి, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇటీవల కాలంలో తన స్ట్రైక్‌రేట్‌పై వచ్చిన విమర్శలకు తిలక్ ఈ ఇన్నింగ్స్‌తో బదులిచ్చాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే తనకు తెలుసని, దూకుడుతో పాటు సమయస్పూర్తి కూడా తన ఆటలో భాగమని తిలక్ నిరూపించాడు.